ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నారాయణరావు ప్రభుత్వాన్ని కోరారు. మొవ్వ మండలం అవిరి పూడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సామాజిక పెన్షన్ల పంపిణీపై రాజకీయ కోణం చూడకుండా వృద్ధులకు, వితంతువులకు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాలంటీర్ ద్వారా పింఛన్ పంపిణీ చేయటం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా వెంటనే గ్రామ సచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు.