ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : పెండింగ్ సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద చేపట్టిన 36 గంటల ధర్నా కొనసాగుతోంది. ధర్నా కార్యక్రమాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి ప్రారంభించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ధర్నా కార్యక్రమానికి పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, ఒంగోలు నగర కార్యదర్శి కెవి సుబ్బమ్మ, సిఐటియు ఒంగోలు నగర కార్యదర్శి టి మహేష్, అంగన్వాడీ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.