ఎన్నికల ప్రక్రియకు సహకరించండి

May 18,2024 12:54 #Prakasam District

ప్రజాశక్తి-ప్రకాశం : ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు ప్రతి ఒక్క నాయకుడు సహకరించాలని మొదలు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు, దర్శి డిఎస్పి  సూచనలతో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మే 13న జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అందరికీ ముందుగా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జూన్ 4న జరుగు కౌంటింగ్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో సంయమనం పాటిస్తూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తమ తమ కార్యకర్తలను నియంత్రణలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలన్నారు. ఎస్సై జి కోటయ్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వివిధ రకాల రెచ్చగొట్టే పోస్టులను మరియు వీడియోలను నమ్మవద్దన్నారు. వాటి వలన ఏదైనా శాంతిభద్రతలకు భంగం కలిగి అవకాశం ఉంటే ఆ విషయాన్ని ముందుగా పోలీస్ శాఖ వారికి తెలియజేయాలన్నారు. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ల పై కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు మీ గ్రూపులో ఏదైనా శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఉన్న పోస్టులు గానీ, రాజకీయ పార్టీల మనోభావలు దెబ్బతినే విధంగా పోస్టులు గాని పెట్టినట్లయితే అట్టి పోస్టులను వెంటనే తొలగించి సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి టిడిపి నాయకులు వివిధ గ్రామాలకు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️