ప్రజాశక్తి-అనకాపల్లి
పోలీస్ అధికారులతో ఎస్పీ కెవి.మురళీకృష్ణ శుక్రవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహణకు, ఎన్నికలకు 72 గంటల ముందు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాకు వచ్చిన కేంద్ర పోలీసు బలగాల అధికారులు, డీఎస్పీలు, ఇతర అధికారులకు ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, చేపట్టవలసిన భద్రతా చర్యలను వివరించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ తెలియజేశారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల అవసరం, మోహరింపు, ప్లాగ్ మార్చ్ నిర్వహణ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అక్రమ మద్యం, డబ్బులు, ఇతర వస్తువులు కట్టడి, వాహనాల తనిఖీ, సెర్చ్ అండ్ సీజర్లు, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రత సంబంధిత అంశాల గురించి ఎస్పీ వివరించారు. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ స్టేషన్లకు చేరుకునే వరకు, ఓటింగ్ ముగిసిన తర్వాత పోలైన ఈవీఎంలను రిసెప్షన్ సెంటర్లకు చేరేవరకు కేంద్ర పోలీసు బలగాల ఎస్కార్ట్ పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయ భాస్కర్, ఎస్బి డీఎస్పీ బి.అప్పారావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కెవి.సత్యనారాయణ, నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీ జిఆర్ఆర్.మోహన్, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, అప్పలనాయుడు, కుమారస్వామి, ట్రైనీ ఐపీఎస్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.