ప్రజాశక్తి-సీతానగరం : సీజనల్ వ్యాధులతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహనరావు.. వైద్యులను ఆదేశించారు. సీతానగరం పిహెచ్సిని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్ను తనిఖీ చేశారు. సీజనల్ జ్వరాలతో ఆసుపత్రికి ఎవరైనా వస్తున్నారా, వారికి చేపట్టిన నిర్దారణ పరీక్షలు, ఆరోగ్య తనిఖీలు తదితర వివరాలపై ఆరా తీసి రికార్డులు పరిశీలించారు. మలేరియా నిర్ధారణకు మైక్రోస్కోప్ పరీక్షా విధానం పక్కాగా నిర్వహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన రక్త పూతల స్లైడ్స్ సకాలంలో పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించాలన్నారు. జ్వరాలు నమోదు అయితే తగు చికిత్స అందజేసి తర్వాత క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర మందులు, కుక్కకాటు, పాము కాటు ఇంజక్షన్లు లభ్యతను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వార్డులో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తగు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి. నిహారిక, ఎఎంఒ సూర్యనారాయణ, సూపర్వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/snm-5.jpg)