వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
హిందూపురం : చూపు లేని వారికి ట్రినిటీ ఆర్గనైెజేషన్, బెంగళూరుకు చెందిన శంకర్ నేంత్రాలయ వారు సంయుక్తంగా కలిసి ఉచితంగా అంధత్వ నివారణకు కృషిచేయడం అభినందనీయమని సిఅండ్ఐజి మిషన్ చర్చి అధ్యక్ష, కార్యదర్శులు అనిల్కుమార్, పాల్ తెలిపారు. శనివారం పట్టణంలోని సిఅండ్ఐజి చర్చి ఆవరణంలో 104వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి నెలా రెండవ శనివారం ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. చూపు కోల్పోయిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు, కావాల్సిన మందులు, కంటి అద్దాలు ప్రయాణ సౌకర్యాలను సైతం కల్పిస్తున్నారన్నారు. అనంతరం 575 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 185 మందిని శస్త్ర చికిత్సకోసం బెంగళూరుకు పంపారు. గత నెల శస్త్ర చికిత్సలు నిర్వహించిన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ఆర్గనైజేషన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్ రాజా, ఉషారాణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్నేహ, డాక్టర్ జస్ప్రీత్ కౌర్తో పాటు అసుపత్రి వైద్య సిబ్బంది, క్యాంపు ఇన్చార్జి శివప్రసాద్, వాలంటీర్లు రహంతుల్లా పాల్గొన్నారు.