ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎస్ఎస్ఎ ఉద్యోగులు
పుట్టపర్తి రూరల్ : సర్వ శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, సర్వ శిక్ష ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా జేఏసీ అధ్యక్షులు ఓబిరెడ్డి కోరారు. 19వ రోజు సమ్మెలో భాగంగా విద్యాశాఖ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఓబిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో గత 20సంవత్సరాల నుండి పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరి విడనాడాలని, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలని కోరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ మాట్లాడుతూ సమగ్రశిక్ష రాష్ట్ర పథక అధికారి శ్రీనివాసరావు ఉద్యోగుల పట్ల అవలంభిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఆయన తీరు ఇలాగే ఉంటే మరొక్కసారి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రామన్న, రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు చంద్రశేఖర్ , నాగరాజు, ఓబులేసు, బాబ్జాన్, హరిప్రసాద్, భవాని, స్రవంతి, ఈశ్వరి, భాగ్యమ్మ, ఆనంద్, రాజశేఖర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఎఎస్ఎ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎస్టియు 19 రోజులనుంచి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఎస్ఎ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారానికి చొరవ చూపకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని ఎస్టీయూ స్టేట్ కౌన్సిల్ నెంబర్ కోనంకి చంద్రశేఖర్ విమర్శించారు. వెంటనే వారితో చర్చలు జరిపి సమ్మెను విరమించడానికి ప్రభుత్వం కషి చేయాలని కోరారు.