పార్టీలోకి చేరిన వారితో సిఎం జగన్, ఇతర నాయకులు
హిందూపురం : లేపాక్షి మాజీ మండల అధ్యక్షులు హనూక్, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్ర దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సార్ అహమ్మద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోమవారం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో హనూక్ లేపాక్షి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. అదే విధంగా తెలుగుదేశం పాలనలోనే చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అన్సార్ అహ్మద్ పని చేశారు. వైసిపి అధికారంలో వచ్చిన తరువాత వీరు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా సంజీవపురం స్టే పాయింట్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మలతో పాటు పలువురు పాల్గొన్నారు.