పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్
హిందూపురం : నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి అభిషేక్ కుమార్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సెక్టారల్ అధికారులతో వారి పరిధిలో ఉన్న పోలింగ్కేంద్రాల్లో సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే విధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి 2024 ఓటరు జాబితా గురించి వివరించారు. అనంతరం స్థానిక అధికారులతో పట్టణంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్టిసి కాలనీలో ఉన్న మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల, ఫక్రోద్దీన్ అలీ అహ్మద్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, బాపూజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాల్ తదితర పాఠశాల్లోని పోలింగ్కేంద్రాలను పరిశీలించి అక్కడున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.