డేటా ప్రాసెసింగ్ సెంటర్ను ప్రారంభిస్తున్న కలెక్టర్
పుట్టపర్తి అర్బన్ : ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే వల్ల శాశ్వత భూ హక్కు, భూముల సరిహద్దుల గుర్తింపు, చుక్కల భూముల నిషేధిత చర్యలు తదితర సమస్యలను పరిష్కారం అవుతాయని, రైతులకు ఇవి ఎంతో ఉపయోగమని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో సర్వే డేటా ప్రాసెసింగ్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, సర్వే ఏడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రీ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. ముఖ్యంగా రీ సర్వేలో డీకేటి పట్టాలు, లంక భూముల వివరాలు, శ్మశానాలకు భూ కేటాయింపు, ఇనాం భూముల పై ఆంక్షలు, భూమి కొనుగోలు పథకం వివరాలు తదితర రెవెన్యూ సమస్యలు అన్నిటిని పరిష్కారం చేయడానికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే ఇన్స్పెక్టర్ కృపాకర్, డిఐ అంజలీదేవి, రొద్దం సర్వేయర్ మొయినుద్దీన్, గోరంట్ల సర్వేయర్ తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.