ఎస్ఐకి ఫిర్యాదు చేస్తున్న తహశీల్దార్ ఎస్.శహబుద్దీన్, రెవెన్యూ సిబ్బంది
చెన్నేకొత్తపల్లి : విధి నిర్వహణలో ఉన్న విఆర్ఒపై దాడిని ఖండిస్తూ గురువారం రెవెన్యూ సిబ్బంది స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహశీల్దార్ ఎస్.శహబుద్దీన్ మాట్లాడుతూ మండల పరిధిలోని చిన్నపల్లి గ్రామానికి చెందిన రియల్టర్ సింగం సోమశేఖర్రెడ్డి బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విధి నిర్వ హణలో ఉన్న విఆర్ఒ లోకేష్పై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించడం హేయమైన చర్య అన్నారు. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కోవాలని కోరారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, ఆర్డిఒకు నివేదికలు పంపించామని, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గంగన మహేశ్వర్రెడ్డి, బాధిత విఆర్ఒ లోకేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.