సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు, అంగన్వాడీ యూనియన్ నాయకులు
హిందూపురం : అంగన్ వాడి వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించక పోతే 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పి శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి నరసింహప్ప అన్నారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమ్మెకు సంబందించిన వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీని అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెపిఫిట్ రూ.5 లక్షలకు పెంచడంతో పాటు ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తు, బీమా అమలు చెయాలన్నారు. ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కోశాధికారి శిరీష, సెక్టార్ లీడర్ శైలజ, నాగమ్మ, హెల్పర్ అంజనమ్మ, సిఐటియు నాయకులు రామకృష్ణ, లక్ష్మీకాంత్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.