ఇంటి పట్టా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి
ధర్మవరం టౌన్ : పేదవారి సొంతింటి కలను సాకారం చేశామని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని టిడ్కో అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడో అపార్ట్మెంట్ను పేదలకు అందించేందుకు నెలకు రూ.4వేలు కంతులు చెల్లించాలని నిబంధన పెట్టి వ్యాపారం చేశారన్నారు. పేదవారు నెలసరి ఇంటి అద్దెలు కట్టుకోవడమే గగనమౌతున్న తరుణంలో నెల వాయిదాలు ఎలా చెల్లించగలరని ఆలోచించిన సీఎం వైఎస్ జగన్ ఉచితంగా పేదలందరికి అపార్ట్మెంట్లలో ప్లాట్లు పంపిణీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ను కూడా కేవలం రూ.1కే చేసి లబ్దిదారులకు యాజమాన్య హక్కులను కల్పించడం జరిగిందన్నారు. మొత్తం రూ.75కోట్లతో 30 బ్లాక్ లను నిర్మించడం జరుగుతోందన్నారు. అపార్ట్మెంట్లో ఒక్కో ప్లాట్ నిర్మాణానికి రూ.6.50 లక్షలు ఖర్చు పెట్టడం జరుగుతోందన్నారు. స్థలంతో పాటు మార్కెట్లో ఒక్కో ప్లాట్ విలువ రూ.12.80 లక్షలు విలువ ఉంటుందన్నారు. ఇంత ఖరీదైన ప్లాట్ను ప్రభుత్వం ఉచితంగా అందించడం చరిత్రాత్మకమన్నారు. టిడ్కో అపార్ట్మెంట్లలో నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని నెలరోజుల్లోపు చిన్న చిన్న పనులు పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. పేద ప్రజల స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు ధర్మవరంలో ఇప్పటికే 13వేల మందికి ఇళ్ల పట్టాలను అందించడంతో పాటు గృహనిర్మాణ సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి, కమిషనర్ రాంకుమార్, ఏపీ డిడ్కో సిఎల్టిసి తిరుమణి, వైసిపి పట్టణాధ్యక్షుడు కోటిరెడ్డి బాలిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, ఎర్రగుంట భాగ్యలక్ష్మి, గోరకాటి పురుషోత్తంరెడ్డి, రేగాటిపల్లి సురేష్రెడ్డి, కడప రంగస్వామి, జేసీబీరమణ, కేతాలోకేష్, అత్తార్ జిలాన్బాషా తదితరులు పాల్గొన్నారు.