కార్మికురాలిని పరామర్శిస్తున్న వ్యకాసం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్
చిలమత్తూరు : మండల పరిధిలోని వడ్డిపల్లి కట్ట వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో 10 మంది మహిళా కార్మికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వారిని గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార్మెంట్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఆరోగ్యకరమైన రవాణ సౌకర్యం కల్పించడంలో టెక్స్ పోర్ట్ సిండికేట్ గార్మెంట్స్ విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు పోరాట పలితంగా అప్పట్లో వేతనాలతో పాటు సరిపడా రవాణ ఖర్చు ఇస్తామన్న యాజమాన్యం తర్వాతి కాలంలో దానిని కుదించిందని అన్నారు. రవాణ ఖర్చు తక్కువ ఇస్తుండటంతో కార్మికులు ఎక్కువగా ఆటోలలో ప్రయాణిస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రవాణకు బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన కార్మికులకు ఆరోగ్యం కుదుట పడే వరకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.