వివరాలు తెలుసుకుంటున్న జెసి నవీన్
మున్సిపల్ అధికారులపై గరం గరం
ప్రజాశక్తి- ఆమదాలవలస
పురపాలక సంఘంలోని ఒకటో వార్డు పరిధిలోని జగ్గుశాస్త్రులపేట ఉన్న ప్రాథమిక పాఠశాల పరిసరాలు అధ్వానంగా ఉండటంపై జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ అప్పలనాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న సాధారణ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల పరిశీలనలో భాగంగా మంగళవారం జగ్గుశాస్త్రులపేట ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలతో పాటు విద్యార్థినీ విద్యార్థులు ఉపయో గించే మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్రంగా తలుపులు లేని మరుగు దొడ్లను చూసి అవాక్కయ్యారు. పురపాలక సంఘ పరిధిలోని ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడానికి గల కారణం ఏమిటని మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ను ప్రశ్నించారు. ఎటువంటి సమాధానం చెప్పకుండా బిక్క మొహం వేయడంతో కనీసం ఎన్నికల నాటికైనా పాఠశాల పరిసరాల్లో అవస రమైన మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, పాఠశాల నిర్మాణ లోపాలను సరిచేయా లని మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.