ఇంతేనా?

Feb 25,2024 22:32 #ఇంతేనా?
ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ

సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో నెట్టు వేసిన ధాన్యం బస్తాలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావించారు. ప్రభుత్వం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటివరకు 4,38,140 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. ఇందులో గ్రేడ్‌-ఎ రకం 281 మెట్రిక్‌ టన్నులు కాగా, సాధారణ రకం 4,37,858 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. జిల్లాలో పండగ సీజన్‌ ముందు వరకు ధాన్యం కొనుగోలు చాలా జోరుగా సాగాయి. ఆ తర్వాత మందగించాయి. ఆమదాలవలస, నరసన్నపేట, పొం దూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం తదితర మండలాల్లో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జరగలేదు. పెసర, మినుము తదితర పంటలను సాగు చేస్తుండటంతో అక్కడ నూర్పులు జరగలేదు. అపరాల సాగు పూర్తి కావడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. జలుమూరు, సారవకోట, పోలాకి, బూర్జ, తదితర ప్రాంతాల్లో పంట వేగంగా చేతికి రావడంతో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగడంతో కేంద్రాలను మూసివేశారు. మండలాల్లో కొనుగోలు పరిస్థితి ఇలా…జిల్లాలో గ్రేడ్‌-ఎ, సాధారణ రకం ధాన్యం కలిపి మొత్తం 4.38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కంచిలిలో అత్యల్పంగా కేవలం 713 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కవిటిలో 782 మెట్రిక్‌ టన్నులు, ఎచ్చెర్లలో 3,228 మెట్రిక్‌ టన్నులు, ఇచ్ఛాపురంలో 3,485 మెట్రిక్‌ టన్నులు, రణస్థలంలో 4,411 టన్నులు, పొందూరులో 4,616 టన్నులు, లావేరులో 4,507 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో అత్యధికంగా జలుమూరులో 32,307 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత స్థానంలో నరసన్నపేట ఉంది. నరసన్నపేటలో 26,985 టన్నులను కొనుగోలు చేశారు. సారవకోటలో 24,846 టన్నులు కొనుగోలు చేశారు. కోటబొమ్మాళిలో 23,589 టన్నులు, నందిగాంలో 22,503 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అదేవిధంగా మెళియాపుట్టిలో 21,591 మెట్రిక్‌ టన్నులు, కొత్తూరులో 20,523 మెట్రిక్‌ టన్నులు, మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారులక్ష్యం చేరుకోకపోవడానికి కారణాలివేనా?ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాఫురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో కరువు పరిస్థితులు తలెత్తాయి. వీటితో పాటు పలాస నియోజకవర్గంలోని పలాస, వజ్రపుకొత్తూరు, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాం తదితర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట అనుకున్నంత స్థాయిలో రాలేదు. ధాన్యం సేకరణకు ఈ సంవత్సరం విధించిన కొత్త నిబంధనలూ ధాన్యం లక్ష్యం చేరుకోకపోవడానికి మరో కారణంగా ఉంది. వాహనాలకు జిపిఎస్‌, మిల్లుల వద్ద రోజుల తరబడి నిరీక్షణ వంటి ఇబ్బందులు పడలేక రైతులు పలుచోట్ల దళారులకు అమ్ముకున్నారు. దీంతోపాటు ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోకముందే పచ్చి ధాన్యాన్ని సైతం కమిషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాలో కరువు పరిస్థితుల కారణంగా పంట లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు జిల్లా నుంచి ధాన్యం రవాణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంవత్సరం ధాన్యం సేకరణ 5 లక్షల టన్నులోపే పరిమితం కానుంది.

➡️