టెన్నికాయిట్ పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి – పలాస
జాతీయస్థాయి 47వ జాతీయ సీనియర్ బాలబాలికల టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీలు పలాసలోని జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ క్రీడాకారులు సమానంగా తీసుకోవాలన్నారు. ఒత్తిడిని జయించే శక్తి క్రీడలకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. తొలుత జాతీయ జెండాను మంత్రి అప్పలరాజు, ఫెడరేషన్ జెండాను మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, టెన్నికాయిట్ పతాకాన్ని టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎ.యాదయ్య ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని మంత్రి అప్పలరాజు స్వీకరించారు. కార్యక్రమంలో టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు వై.డి రామారావు, రాష్ట్ర కార్యదర్శి కె.ఎన్.వి సత్యనారాయణ, కోశాధికారి పి.తవిటయ్య, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ముఖ్య సలహాదారులు పి.సుందరరావు, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా అధ్యక్షులు ఎం.వి రమణ, ఎఎంసి చైర్మన్ పి.వి సతీష్ తదితరులు పాల్గొన్నారు.