టిడిపిలో అచ్చెన్న చిచ్చు

ఎచ్చెర్ల స్థానానికి బిజెపి విజయనగరం జిల్లా అధ్యక్షుడు

రెండు చోట్ల అసమ్మతి నాయకులకు సీట్లు

‘కళా’కూ టికెట్‌ రాకుండా చేశారంటూ శ్రేణుల ఆగ్రహం

సీనియర్లు పోటీలో లేకుండా జాగ్రత్త పడ్డారంటూ విమర్శలు

అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కేలా స్కెచ్‌ వేశారని ఆరోపణ

టిడిపిలో మరోసారి టిక్కెట్ల చిచ్చు రేగింది. ఎచ్చెర్ల సీటుపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్‌ నాయకుడు కళా వెంకటరావుకు సైతం అధిష్టానం మొండిచేయి చూపింది. ఆ సీటును బిజెపికి కేటాయించడంతో కళా వర్గీయులు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులకు సీట్లు ఇచ్చి ఇన్‌ఛార్జీలను పక్కన పెట్టడంతో అక్కడ పార్టీ శ్రేణులు కుతకుతలాడుతున్నాయి. జిల్లాలో ఎన్నికల షెడ్యూల్‌ విడులయ్యే వరకు పార్టీ పరిస్థితి సానుకూలంగానే ఉందని, పార్టీ తీసుకున్న నిర్ణయంతో రానున్న ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లనుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతలకు టిక్కెట్లు రాకపోవడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడే కారణమంటూ వారు నిందిస్తున్నారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఎచ్చెర్ల స్థానానికి బిజెపి విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.ఈశ్వరరావు పేరును ఖరారు చేసిన జిల్లాకు సంబంధించి కూటమి తరుప పోటీ చేసే అభ్యర్ధుల ఎవరనేది తేలిపోయింది. టిడిపి ఏడు స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎచ్చెర్ల సీటును తన మిత్ర పక్షం బిజెపికి కేటాయించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే టిడిపి సీట్లలో మూడు చోట్ల మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు చోట్ల అభ్యర్థులను మార్చించి. ఒకచోట బిజెపికి ఇచ్చింది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పోటీ చేయగా, ప్రస్తుతం ఆ స్థానాన్ని పార్టీ నాయకుడు గొండు శంకర్‌కు కేటాయించింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు పోటీ చేయగా, ఇప్పుడు ఆ స్థానాన్ని మామిడి గోవిందరావుకు కేటాయించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎచ్చెర్ల స్థానాన్ని బిజెపికి కేటాయిండచంతో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన టిడిపి సీనియర్‌ నాయకుడు కళా వెంకటరావు జిల్లాలో ఏకంగా సీటే దక్కని పరిస్థితి వచ్చింది.పావులు కదిపిన అచ్చెన్నజిల్లాకు సంబంధించి టిక్కెట్ల కేటాయింపులో అచ్చెన్న మార్కు రాజకీయం కనిపిస్తోందనే చర్చసాగుతోంది. తమకు నేతలకు టిక్కెట్లు రాకపోవడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కారణమనే భావన మూడు నియోజవర్గాల కేడర్‌లో నెలకొంది. టిక్కెట్ల ప్రకటన తర్వాత పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో నిర్వహించిన అసమ్మతి సమావేశాల్లో పార్టీ ఇన్‌ఛార్జీలతో పాటు నాయకులు సైతం బహిరంగానే మాట్లాడటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. తమకు టిక్కెట్‌ రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమంటూ బహిరంగంగానే చెప్పారు. ఆత్మీయ సమావేశాలకు వెళ్లొద్దంటూ అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసిన అంశాన్నీ వారు సమావేశాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఎచ్చెర్లలో కళా వెంకటరావుకు సీటు కేటాయించకపోవడంతో ఆయన వర్గీయులు కుతకుతలాడుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానాన్ని ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో పట్టున్న తమ నేతను అక్కడకు పంపడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని నాయకులు ప్రశ్నిస్తున్నారు.అంతా వ్యూహాత్మకమేనా?టిక్కెట్ల కేటాయింపు విషయంలో అచ్చెన్నాయుడు ఒక వ్యూహాత్మంగా వ్యహరించారన్న చర్చ నడుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలను ఒక పద్ధతి ప్రకారం తప్పించడంతో కీలకంగా వ్యవహరించారని అసమ్మతి నాయకులు చెప్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే జిల్లా నుంచి మంత్రి పదవికి తన పేరును తప్ప మరొకరి పేరు లేకుండా చేయడమే లక్ష్యంగా ఆయన పావులు కదిపారని వారు అంటున్నారు. సీనియర్‌ నాయకుడు కళా వెంకటరావును పొరుగు జిల్లాకు పంపడం, శ్రీకాకుళం, పాతపట్నం స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడం అందులో భాగమని వారు చెప్తున్నారు. జిల్లాలో తన కంటూ ఒక ప్రత్యేకవర్గం సృష్టించుకోవాలన్న ఆలోచన అందులో అంతర్లీనంగా దాగుందని వారు అంటున్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పలాస ఇన్‌ఛార్జి గౌతు శిరీష, నరసన్నపేట ఇన్‌ఛార్జి బగ్గు రమణమూర్తి మాత్రమే ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం ఇన్‌ఛార్జీలు మాత్రం స్వతంత్య్రంగా వ్యహరించడం ఆయనకు కంటగింపుగా మారింది. దీంతో పాటు తన వెంట ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన మాటను ఖాతరు చేయని వారిని తప్పించారనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా అచ్చెన్న వ్యవహారశైలితో తమ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రూపుల పోరు, ప్రభుత్వంపై వ్యతిరేకతతో గెలుపు కష్టంగా మారిన తరుణంలో టిడిపిలో టిక్కెట్ల చిచ్చు తమకు లాభిస్తుందని మూడు నియోజకవర్గాల వైసిపి నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు.

➡️