టిడిపి హయాంలో డేటా చౌర్యం

ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని టిడిపి నాయకుల వ్యాఖ్యలు దొంగే దొంగా.. దొంగా అన్నట్లు ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన

ధర్మాన కృష్ణదాస్‌, వైసిపి జిల్లా అధ్యక్షులు

  • వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని టిడిపి నాయకుల వ్యాఖ్యలు దొంగే దొంగా.. దొంగా అన్నట్లు ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం, ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం టిడిపికి అలవాటు అని విమర్శించారు. 2017లో సేవా మిత్ర యాప్‌ను ఉపయోగించి టిడిపి, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి లక్షల మంది ఓట్లను తొలగించి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిందని పేర్కొన్నారు. దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా ఆ పార్టీయే మరోసారి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ, మొబైల్‌కు వచ్చే ఒటిపిలను సైతం అడుగుతున్నారని తెలిపారు. ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. బోగస్‌ ఓట్లు, దొంగ ఓట్ల సంస్కృతి టిడిపి వారిదేనని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఆ దిశగా కృషి చేస్తున్న రాష్ట్రంలోని ఎన్నికల యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

➡️