కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
పలాస:
విశాఖపట్నం చినగదిలి మండల తహశీల్దార్ సనపల రమణయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కళింగ సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు డిమాండ్ చేశారు. తహశీల్దార్ రమణయ్యకు నివాళ్లర్పిస్తూ స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీపరుడైన తహశీల్దార్ రమణయ్య విధి నిర్వహణలో ప్రజా మన్ననలు చూరగొన్నారని చెప్పారు. వజ్రపుకొత్తూరు తహశీల్దార్గా 2012లో పనిచేశారని, ఆ సమయంలో మండల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. విశాఖ జిల్లాలో భూ దందాలను అరికట్టారని, దీన్ని జీర్ణించుకోలేక హత్య చేశారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.గిరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, దువ్వాడ శ్రీకాంత్, రామానంద స్వామి పాలవలస వైకుంఠ రావు డబ్బీరు నాగు, కంచరాన భుజంగరావు, సత్యానంద్ పాల్గొన్నారు.