మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
* కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమల్లో ఎలాంటి అలసత్వం చూపరాదని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయుస్మాన్ కార్డుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 1.84 లక్షల కార్డుల పంపిణీ మాత్రమే జరిగిందని, ఇంకా మిగిలిన కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు రిజిస్ట్రేషన్లు జిల్లాలో ఇప్పటివరకు 22,081 మాత్రమే జరిగాయని, మిగిలిన వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సర్వర్ ఎర్రర్, మిస్ మాచ్ లాంటి సాంకేతిక సమస్యలకు జిల్లా రిజిస్ట్రార్తో సమన్వయం చేసుకుని లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులను కల్పించడంలో భాగంగా 2003 జులై 31కు ముందు కేటాయించిన భూములపై సర్వేను పూర్తి చేయాలని చెప్పారు. రీ సర్వే, డిజిటల్ సైన్, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ డేటాను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్పి సిఇఒ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డిఎ పీడీ విద్యాసాగర్, జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మథరావు, ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.