మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
- ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి – బూర్జ
ఇటు ప్రజలను, అటు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడనున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండలంలోని నీలాపురం, తుడ్డలిలో పలు కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. లోకేష్ చేసిన యువగళం పాదయాత్రతో వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న టిడిపి నాయకులకు ప్రజలు పడుతున్న బ్రహ్మరథమే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి గురువారం జిల్లాలో పర్యటిస్తున్నారని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు తుడ్డలి సర్పంచ్ అంపిలి ప్రభావతి, బూర్జ ఎంపిటిసి చొక్కార పోలినాయుడు, నాయకులు పీరుకట్ల విశ్వప్రభాకరరావు, గణపతిరావు తదితరులున్నారు.