మాట్లాడుతున్న కూన రవికుమార్
జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి- ఆమదాలవలస
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలోనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని, టిడిపి ప్రభుత్వం ఏర్పాటుతోనే మహిళా సాధికా రత సాధ్యమవుతుందని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళా దినోత్సవం సందర్భంగా ‘కలలకు రెక్కలు’ అనే సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు స్వస్తి చెప్పి ఇంటికి పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అర్హులని అన్నారు. మహిళలు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కలలను రాజీ పడకుండా వారి లక్ష్యానికి చేరుకునే విధంగా ఈ పథకం అడుగులు వేయిస్తుందని తెలిపారు. ఈ పథకానికి నమోదు చేసుకున్న మహిళలు ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణం తీసుకుంటే ఆ రుణానికి వడ్డీకి టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని అన్నారు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించవచ్చునని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన ఏటా రూ.15 వేలు టిడిపి అధికారంలోకి వస్తే ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ వైస్చైర్పర్సన్ కూన వెంకట రాజ్యలక్ష్మి, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు బోయిన సునీత పాల్గొన్నారు.