పాల్గొన్న స్పీకర్ సీతారాం, ఎంపీ రామ్మోహన్నాయుడు
ఎంపీ రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి- ఆమదాలవలస
రాష్ట్ర భాగస్వామ్యం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వేస్టేషన్ల అభివృద్ధిని కొనసాగిస్తున్నారని పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్ (ఆమదాలవలస)లో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి పర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని జాతిపిత మహాత్మాగాంధీ దూసి రైల్వేస్టేషన్లో అడుగుపెట్టిన ఘన చరిత్ర ఉందని, అదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిరంతరం పార్లమెంట్లో పోరాటం చేశామని తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్ భవన నిర్మాణంతో పాటు దూసి, ఊసవానిపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి, నౌపడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.19 కోట్లు, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.18 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు రైల్వే సేవలు మరింత చేరువయ్యేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అమృత భారత్ స్టేషన్ల పథకం కింద పలు రైల్వేస్టేషన్లు మౌలిక సదుపాయాలకు నోచుకోవడం ద్వారా ప్రజాభిమానం చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ పథకం ద్వారా స్టేషన్లో సమావేశ మందిరాలు, ఇరువైపులా అప్రోచ్ రోడ్డు, పార్కింగ్ ఏరియా, పాదాచారులకు ప్రత్యేక దారి, ల్యాండ్ స్కేటింగ్ ఆధునిక లైటింగ్ వేగవంతమైన వైఫై సేవలకు 5జి టవర్లు వంటివి అందుబాటులోకి వస్తాయన్నారు. స్టేషన్ల వద్ద డ్రాకుల శుభ్రత సులభమైన నిర్వహణ కోసం బ్యాలెన్స్ లెస్ ట్రాకులు ఏర్పాటు నిర్మాణానికి నోచుకుంటాయన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా వీల్చైర్లు, ప్రత్యేక మార్గాలు ఇతర సదుపాయాలు వెయిటింగ్ హాల్స్ వాటికి అనుబంధంగా ఫుటేరియా వంటివి ఏర్పాటు అవుతాయన్నారు. ఇటువంటి అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దూసి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు కావడంతో అక్కడా సోమవారం చీఫ్ ఇంజనీర్ వి.సాయిరాజ్ ఆధ్వర్యాన వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎడిఆర్ ఎం.గుప్త, బిజెపి జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, ఎస్సిసి సభ్యులు ఆనెపు రామకృష్ణ నాయుడు, ఎస్.నర్సింగరావు, రైల్వేస్టేషన్ మాస్టర్ మొదలవలస రవి, కమర్షియల్ ఇన్స్పెక్టర్ గణేష్ తాపా, రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ ఎల్. శివశంకర్ పాల్గొన్నారు.