మాట్లాడుతున్న చందు
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చందు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగు పర్చాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా ఉపాధ్యక్షులు డి.చందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం నగర శాఖ మహాసభలు ప్రైవేటు పంక్షన్ హాల్లో జరిగాయి. మహాసభల్లో ఆయన హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వరంగ విద్యను పేదలకు అందకుండా చేస్తోందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ఛార్జీలు పెంచి సకాలంలో నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు అర్ధాకలితో అలమటించే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. విద్యారంగంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకుల సంఖ్యను పెంచాలన్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు తరగతి గదులకు పరిమితమయ్యే ఆన్లైన్ విద్యకు బదులుగా ఉపాధ్యాయ బోధన అందించాలన్నారు. ఈ మహాసభల్లో నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా తిరుపతి, అమ్మాజీరావు, గర్ల్స్ కన్వీనర్ రేవతి, పవిత్ర, కమిటీసభ్యులుగా సీతమ్మ, దివ్య చాందిని, మణి, రాజు, అనంత్, లక్ష్మణ్, అప్పలరాజు, నితిన్, తరుణ్, భూపతి, భరణిలతో పాటు 19మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ పాల్గొన్నారు.