మాట్లాడుతున్న మండల ఎఒ భార్గవి
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం
మండలంలో ఎక్కడాలేని డిప్యుటేషన్ తన ప్రాదేశికం బిర్లంగ్ పంచాయతీలో ఎందుకు వేశారని టిడిపి ఎంపిటిసి దక్కత ఏకంబరిదేవి అధికార యంత్రాంగంపై మండిపడ్డారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బోర పుష్ప అధ్యక్షతన గురువారం సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా వైద్య శాఖ సమీక్షలో ఆమె అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనవసరం వైద్యసిబ్బందిని పంపించడం వల్ల బుధవారం నిర్వహించ్సాన వ్యాక్షినేషన్ నిలిచిపోయిందని అన్నారు. గ్రామస్తులు గాని, నాయకులు గాని వైద్య సిబ్బందిపై ఎటువంటి ఫిర్యాదులు చేయకపోయినా డిప్యుటేషన్పై ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే డిప్యుటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అలాగే వ్యవసాయశాఖ సమీక్షాలో ధాన్యం అమ్మకాలల్లో కలుగుతున్న ఇబ్బందులు ప్రస్తావించారు. ఇచ్ఛాపురం నుంచి పలాస, టెక్కలి రైస్ మిల్లులకు పంపించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు గుజ్జు దిల్లేశ్వరరావు, నీలపు సారథి సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మండల ఎఒ భార్గవి మాట్లాడుతూ మండలంలోని ఏకైక మిల్లు బ్యాంకు గ్యారంటీ అయిపోవడంతో పక్కన ఉన్న మిల్లులకు పంపిస్తున్నామని వెల్లడించారు. ట్రాక్టర్తో టెక్కలి వరకు ధాన్యం తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని తేలుకుంచి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ట్యాగ్కు ముందు తెలిస్తే ట్రాక్టర్ బదులు వేరే వాహనం పెట్టుకోడానికి వీలు కలుగుతుందన్నారు. ఎస్మా చట్టం జారీ చేసిన అంగన్వాడీ కార్యకర్తలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్ నర్తు వరప్రసాద్ ఐసిడిఎస్ అధికారి నాగారాణిని నిలదీశారు. దీనిపై ఆమె స్పందిస్తూ… ఇప్పటికే అన్ని కేంద్రాలకు నోటీసులు జారీ చేశామని, ఉన్నత అధికారులు అదేశాలు మేరకు చర్యలు తీసుకుంటామని నాగారాణి తెలిపారు. రేషణ్ సరుకులు పంపిణీలో ఇంటింటికీ రేషన్ సరుకులు చాల గ్రామాల్లో జరగడం లేదని సభ్యులు కారింగ మోహనరావు అన్నారు. కొన్ని గ్రామాల్లో కందిపప్పు పంపిణీ చేస్తూ… కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేయడం లేదని, దీంతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని సభ్యులు ఏకాంబరిదేవి డిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు శిస్తులు కట్టినా ఛానల్ మరమ్మతులు చేపట్టలేదని సభ్యుడు త్రినాథ ఇరిగేషన్ ప్రతినిధి రాజూను ప్రశ్నించారు. బహుదా ఛానల్ వద్ద ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనివల్ల ఛానల్ మరమ్మతులు గురవుతున్నాయని సభ్యులు ఫిర్యాదు చేశారు. సమావేశంలో జెడ్పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, ఎంపిడిఒ ఈశ్వరరావు, ఎంఇఒ అప్పారావు, డాక్టర్ వేచ్ఛా సంతోష్, వెలుగు ఎపిఎం ప్రసాదరావు పాల్గొన్నారు.