మాట్లాడుతున్న జ్ఞాన సువర్ణరాజు
- శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉచితంగా న్యాయ సేవలు అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.జ్ఞాన సువర్ణరాజు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి, స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారికి ఎటువంటి ఖర్చు లేని సత్వర న్యాయ పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో గురువారం ప్రజా ప్రయోజిత సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లినా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చన్నారు. న్యాయ సేవలు ఉపయోగించుకునేందుకు అవగహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ శాఖలైన గృహనిర్మాణ సంస్థ, రెవెన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగరపాలక సంస్థ, తపాలా, బ్యాంకింగ్, ఉపాధిహామీ, నీటిసరఫరా, పారిశుధ్యం, విద్య, బీమా, వైద్య సేవలు, విద్యుత్ తదితర సేవలు పౌరులకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సేవల్లో ఎలాంటి లోపాలు ఎదురైనా తమ వద్దకు వచ్చి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. సదస్సులో సామాజికవేత్త గేదెల ఇందిరా ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.