సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డిఒ భరత్ నాయక్
- ఆర్డిఒ భరత్ నాయక్
ప్రజాశక్తి- పలాస
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని ఆర్డిఒ భరత్ నాయక్ అధికారులను ఆదేశించారు. తద్వారా వ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్యాన్ని పరిరక్షించవచ్చని చెప్పారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పలాస డివిజన్ పరిధిలోని ఎంపిడిఒలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వంశధార శివారు భూములకు సాగునీరందేలా చూడాలన్నారు. ఇరిగేషన్, వంశధార కాలువల్లో పూడికతీతలు, మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడాలన్నారు. హుదూద్, టిడ్కో గృహాలు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటి మరమ్మతులకు ఎంత వ్యయం అవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పలాస తహశీల్దార్ ఎస్.ఎస్.వి.ఎస్ నాయుడు, ఎంపిడిఒ మెట్ట వైకుంఠరావు, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, పలు మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు తదితరులు పాల్గొన్నారు.