వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా అధికారులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఈనెల 18వ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. విజయవాడ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, రోజువారీ నివేదికల పంపిణీ, ఎపిక్ కార్డుల జనరేషన్, సీజర్ మేనేజ్మెంట్ రిపోర్టు తదితర అంశాలపై సమీక్షించారు. నిఘా బృందాలను పటిష్టం చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఒ ఎం.గణపతిరావు, ఆర్ఒలు నూరుల్ కమర్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.