సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
- లూజు పెట్రోల్ విక్రయించరాదు
- కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ రోజున పటిష్టమైన భద్రత ఉండాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబరులో ఎస్పి జి.ఆర్ రాధికతో కలిసి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ కొనసాగాలన్నారు. డిఎస్పిలు రెండు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని 120 పెట్రోల్ బంకుల నుంచి లూజు పెట్రోల్ విక్రయాలు చేయకుండా సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని డిఎస్ఒ బి.శాంతిశ్రీని ఆదేశించారు. జిల్లాలో పండుగలు చేసుకునే పలు ప్రాంతాల్లో సమూహాలుగా ఉండరాదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మందుగుండు సామగ్రి విక్రయించకుండా లైసెన్స్లు కలిగిన యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో టెక్కలి రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, అదనపు ఎస్పి ప్రేమ్కాజల్, ఎస్ఇబి అదనపు ఎస్పి గంగాధరం, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు భరత్ నాయక్, సిహెచ్.రంగయ్య, అప్పారావు, లక్ష్మణమూర్తి, సుదర్శన్ దొర, రామ్మోహనరావు, డిఎస్పిలు తదితరులు పాల్గొన్నారు.