ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
- ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి
- స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి – ఎచ్చెర్ల
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం)ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి చిలకపాలెంలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లాలో పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఇవిఎంల స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. పలు నియోజకవర్గాల నుంచి వచ్చే బస్సుల ప్రవేశము, నిష్క్రమణ, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు హాళ్లను పరిశీలించారు. శాసనసభ నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎలా భద్రపరుస్తున్నారన్న వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు, సిసి కెమెరాలు అగ్నిమాపక యంత్రాలు తదితర భద్రతా ఏర్పాట్ల వివరాలను పరిశీలించారు. పర్యటనలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాకుళం ఆర్డిఒ సిహెచ్.రంగయ్య, సుడా వైస్ చైర్మన్ ఓబులేసు, ఆర్అండ్బి ఎస్ఇ, శిక్షణా తరగతుల నోడల్ అధికారి బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు.