ప్రజాశక్తి-నార్పల (అనంతపురం ) : నార్పల మండలలోని సెవెన్ హిల్స్ కల్యాణ మండపంలో మంగళవారం గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన వారికి, నగదు బహుమతి, జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ సేవలను గుర్తించిన జగనన్న భవిష్యత్తులో వారికి మరింత మేలు చేకూరుస్తారని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తే జగనన్న ప్రభుత్వంలో నేరుగా వాలంటీర్ వ్యవస్థతో ఇంటి దగ్గరికే సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.వాలంటీర్ల వ్యవస్థ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మరోసారి ప్రజలని మోసం చేయడానికి ఎన్నికల సమయంలో వస్తున్న ప్రతిపక్షాలని తిప్పికొడదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ ప్రమీల ఎం ఈ ఎం ఎస్ రాష్ట్ర డైరెక్టర్ మండల కన్వీనర్ నిట్టూరు రఘునాథరెడ్డి ఎంపీపీ నాగేశ్వరరావు సహకార పరపతి రంగం అధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి వైస్ ఎంపీపీ మల్లేశ్వరయ్య వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.