ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులు కలసి పనిచేయాలని, జగనన్న పాలవెల్లువకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో సెంటర్లు ప్రారంభం కాని చోట వెంటనే పరిశీలించాలని, పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా సరఫర అవుతున్న వస్తువుల సరఫరాను ఎండియు ఆపరేటర్ల ద్వారా డిప్యూటీ తహశీల్దార్లు పూర్తిస్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, తహశీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు, డీఈఓ, జడ్పీ సీఈఓ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి, డిసిఓ తదితరులతో నిర్వహించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని. ఈ కార్యక్రమంకు సంబంధించి నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా క్రీడామైదానాలు, స్వాగత ఏర్పాట్లు, కావాల్సిన వసతులు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆడుదాం ఆంధ్రకు సంబంధించి లోగో ఖచ్చితంగా ఉండేటట్లు చూడాలని అన్నారు. ఆన్లైన్లో వరుస వారీగా క్రీడలను నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని 11 మండలాలలో 205 పాలకేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ఇంకా ప్రాథమికంగా కొన్ని సాంకేతికపరమైన స్థానికంగా సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే సంబంధిత సిబ్బంది ఆప్రాంతాలకు వెళ్లి పరిష్కరించాలని అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న మండలాలకు సంబంధించి అధికారులతో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. పౌరసరఫరాల వ్యవస్థ ద్వారా సరఫరా చేసే వస్తువులను ఎండియు ఆపరేటర్ల ద్వారానే సరఫరా చేసే బాధ్యతను డిప్యూటీ తహశీల్దారులు నిర్వహించాలని, ఎండియు ఆపరేటర్లు సరుకులు సరఫరా చేసే ప్రాంతానికి వాలంటీర్లు వెళ్లి నూతనంగా వచ్చిన యాప్ను ఇన్స్టాల్ చేయాలన్నారు. జడ్పీ సీఈఓ ప్రభాకర్రెడ్డి, డిఆర్డిఏ పిడి తులసి, డిసిఓ బ్రహ్మానందరెడ్డి, డీఎస్ఓ శంకరన్, స్పోర్ట్స్ అధికారి బాలాజీ పాల్గొన్నారు.
!['ఆడుదాం ఆంధ్ర'ను విజయవంతం చేద్దాం : జెసి](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-1-copy-194.jpg)