‘ఆధ్యాత్మిక’ స్థానాలపై బిజెపి కన్ను!తిరుపతి బిజెపి ఎంపి సీటు రత్నప్రభకేనా.. శ్రీకాళహస్తిలో పోటీకి ‘కోలా’ కుతూహలం ‘టిడిపి’శ్రేణుల్లో అయోమయం ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులను తేల్చకనే చివరి వరకూ నాన్చుతూనే ఉంటారు. ఈసారి జనసేన, బిజెపిలతో పొత్తులో భాగంగా సగానికి పైగా సీట్లు తేల్చకనే అయోమయంలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గాన్నే నమ్ముకుని రెండు మూడేళ్లుగా పార్టీ ప్రచారం చేస్తున్న ఇన్ఛార్జిల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి సీట్లు జనసేన, బిజెపి పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలూ తన్నుకు పోతాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి సీటు జనసేనకేనని పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తిరుపతి, శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక క్షేత్రాలైన వాటిలో ఒకటి ఖచ్చితంగా తమకు కావాలని బిజెపి పట్టుబట్టడంతో సోమవారం ప్రకటించాల్సిన తుది జాబితా మరోసారి వాయిదా పడింది. 22 గంటల్లోపు ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్రెడ్డి రెండేళ్లుగా ప్రచారంలో ఇంటిల్లిపాది దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి వైసిపి ఎంఎల్ఎ బియ్యపు మధుసూదన్రెడ్డిని టార్గెట్ చేస్తూ అతని అక్రమాలను, భూకబ్జాలను ఎండగడుతూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అయితే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్ ఢిల్లీలో మకాం వేసి శ్రీకాళహస్తి సీటు బిజెపికే కేటాయించాలని, తాను పోటీచేసి గెలిచి తీరుతానని కాకా పడుతున్నారు. ప్రచారం కోసం 50 లక్షల విలువైన నాలుగు ప్రచార వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం పోస్టర్లు, బ్యానర్లుతో నిండిపోయింది. కమలం గుర్తుకే మీ ఓటు అంటూ పోస్టర్లు వెలిసాయి. బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించాలని అధినేత చంద్రబాబునాయుడు, యువగళంలో నారా లోకేష్ గతంలో ప్రకటించి ఉన్నారు. దీంతో మాజీ ఎంఎల్ఎ ఎస్సీవి నాయుడు కినుక వహించారు. కోలా ఆనంద్కు టిక్కెట్ వస్తుందని నియోజకవర్గంలో చర్చ జరగడంతో కోలా ఆనంద్కు సీటు ఇచ్చినా మనస్ఫూర్తిగా గెలిపిస్తానని అనుయుయులతో చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొజ్జల సుధీర్రెడ్డి మాత్రం హైదరాబాద్లో కూర్చుని లోకేష్ ద్వారా ఎలాగైనా టిడిపికే ఇచ్చేలా పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలో మాత్రం బొజ్జల సుధీర్రెడ్డి టిడిపి తరపున, వైసిపి అభ్యర్థి బియ్యపు మధుసూదన్రెడ్డి మధ్యే పోటీ ఉంటుందని చర్చ నడుస్తోంది. బిజెపికి ఇస్తే ఈ సీటు వైసిపికి సునాయాసం అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతిలో నలుగురు పోటీ పడుతున్నప్పటికీ ఈ సీటు జనసేనకే దక్కనుంది. జనసేనలోకి వెళ్లయినా పోటీ చేయాలని టిడిపి ఆశావాహులు పావులు కదుపుతుండటం గమనార్హం. అలాగే తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బిజెపి తీసుకోవడంతో అక్కడ అభ్యర్థిగా కర్నాటక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రత్న ప్రభకు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ సీటును టిడిపి నుంచి ఆశిస్తున్న మాజీ మంత్రి పనబాక లక్ష్మికి తనకు సీటు కేటాయించకపోతే బిజెపి ఓటమి తథ్యమని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.