చీలికలు…పీలికలుగా..!టిడిపి అభ్యర్థి సుధీర్రెడ్డికి రెబల్స్ బెడదఎవరికి వారే ‘స్వతంత్ర’ అభ్యర్థులుగా బరిలోకినా గెలుపు ఆపే దమ్ము ఎవరికీ లేదు : బొజ్జలశ్రీకాళహస్తిలో ‘కాకా’ రాజకీయంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో శ్రీకాళహస్తిలో టిడిపి – జనసేన – బిజెపి కూటమి చీలికలు పీలికలయ్యింది. ఎవరికి వారే సీటును ఆశిస్తూ రచ్చకెక్కుతున్నారు. కూటమి అభ్యర్థిగా అధినేత చంద్రబాబు ప్రకటించిన బొజ్జల సుధీర్రెడ్డికి రెబల్స్ బెడద తప్పేలా లేదు. తామూ టిక్కెట్ రేస్లో ఉన్నామని, అధిష్టానం పునరాలోచించకపోతే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతామని అల్టిమేటం ప్రకటించారు. బిజెపి నుంచి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పోటీలో ఉన్నానని అధికారికంగా ప్రకటించి ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నారు. వైసిపి నుంచి టిడిపి కండువా కప్పుకున్న మాజీ ఎంఎల్ఎ ఎస్సీవీ నాయుడు తన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కోటా వినుత తానూ బరిలో ఉన్నానని వెల్లడించారు. ఇదేగనుక జరిగితే శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్రెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగితే స్వతంత్ర అభ్యర్థులుగా మిగిలిన వారు బరిలో దిగే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. నిజంగానే స్వతంత్రంగా బరిలో దిగుతారా? లేక ఏదైనా లబ్ది ఆశించి కాకా రాజకీయం చేస్తున్నారా? అన్నది వేచి చూడాల్సిందే. శ్రీకాళహస్తి తొలినుంచి టిడిపికి కంచుకోట. ఒకప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ఇక్కడినుంచే గెలిచారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి హ్యాట్రిక్ సాధించారు. 2019 ఎన్నికల్లో తొలిసారిగా వైసిపి ఎంఎల్ఎగా బియ్యపు మధుసూదన్రెడ్డి గెలుపొందారు. తండ్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మరణానంతరం కుమారుడు బొజ్జల సుధీర్రెడ్డి రాజకీయ వారసునిగా వచ్చారు. చంద్రబాబు సైతం అతనికే టిక్కెట్ ఇచ్చారు. అయితే బిజెపి నుంచి కోలా ఆనంద్, జనసేన నుంచి కోటా వినుత నియోజకవర్గ ఇన్ఛార్జిలుగా ఉన్నారు. ఎన్నికల్లో ఎవరికి వారే కూటమిలో భాగంగానే సీటు కోసం మూడు పార్టీలూ పోటీ పడ్డాయి. మాజీ ఎంఎల్ఎ ఎస్సీవీ నాయుడు సీటు కోసమే టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే బొజ్జల సుధీర్రెడ్డికి సీటును ప్రకటించడంతో రెబల్స్ అందరూ ఏకమయ్యారు. తమలో సీటు ఎవరికిచ్చినా పర్వాలేదని, బొజ్జల సుధీర్రెడ్డికి మాత్రం ఇవ్వరాదని పట్టుబట్టి ఉన్నారు. కూటమి ధర్మంలో భాగంగా బిజెపి నుంచి తనకు ఇవ్వాలని కోలా ఆనంద్, జనసేన నుంచి తనకే కావాలని కోటా వినుత వీధికెక్కారు. అందరూ ఒక్కటైనా తన గెలుపును ఆపలేరని బొజ్జల సుధీర్రెడ్డి మీడియాకు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రెబల్స్ రచ్చ మూడు పార్టీల అధినేతలకూ తలనొప్పిగా మారింది.