తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు : జేసీ ప్రజాశక్తి -తిరుపతి టౌన్రానున్న వేసవిని దష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరము నందు నీటిపారుదల, జల వనరుల శాఖ అధికారులతో తాగునీటి ఎద్దడి నివారణకు సంబంధించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న వేసవికాలాన్ని దష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. నీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. నీటి సరఫరా విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పటికప్పుడు సకాలంలో స్పందించి వాటిని త్వరగా పరిష్కరించేలా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సింగల్ విలేజ్, మల్టీ విలేజ్ పథకం ద్వారా 272 హాబిటేషన్లలో నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజరు కుమార్, జన వనరుల శాఖ అధికారి వెంకటరమణ, డి పి ఓ రాజశేఖర్ రెడ్డి, ఎం.వి.రమణారెడ్డి ఎస్ ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్, సూళ్లూరుపేట, నాయుడుపేట పుత్తూరు, మున్సిపల్ కమిషనర్లు గంగా ప్రసాద్, జనార్దన్ రెడ్డి, కె ఎల్ న్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి నోడల్ అధికారులకు కేటాయించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా కషి చేయాలని జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు సార్వత్రిక ఎన్నికలు -2024 సన్నద్ధత పై నోడల్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, సీజర్ ఆఫ్ క్యాష్, లిక్కర్, డ్రగ్స్, మద్యం మాదకద్రవ్యాలు అక్రమ నిల్వలు తదితరాలపై చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వైవలెన్స్ టీంలు, సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల్ కిశోర్, అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, వెంకట్రావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవి కిరణ్, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఆసీస్ కుమార్ పాల్గొన్నారు.