ప్రజాశక్తి – తిరుపతి టౌన్ తిరుపతిలో జనసేన కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాస్ను ప్రకటించినప్పటి నుంచి టిడిపిలో మాజీ ఎంఎల్ఎ ఎం.సుగుణమ్మ ఆధ్వర్యంలో చిచ్చు రగులుతూనే ఉంది. మీడియా వేదికగా ఎం.సుగుణమ్మ ఆరణి శ్రీనివాస్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే టిడిపి అధినేతలు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, అచ్చెంనాయుడు జోక్యంతో ఒకింత మెత్తబడిన ఎం.సుగుణమ్మ ఆరణి శ్రీనివాసులుకు మద్దతు ఇస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఆరణి శ్రీనివాసులు సోమవారం ఎం.సుగుణమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి మద్దతు కోరారు. అనంతరం మీడియాతో ఎం.సుగుణమ్మ మాట్లాడుతూ పొత్తులో భాగంగా తిరుపతి ఎంఎల్ఎ టికెట్ జనసేనకు కేటాయించారని, కలసికట్టుగా టిడిపి శ్రేణులంతా ఐక్యంగా ఎన్నికల్లో పనిచేయాలని ఆదేశించారు. వైసిపి ఐదేళ్ల అరాచక పాలనకు స్వస్తి పలికారు. ఎన్నికల్లో ఆరణి శ్రీనివాస్ను గెలిపించుకుని మహాకూటమికి కానుక ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కష్ణ యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, బుల్లెట్ రమణ, ఆనంద్ యాదవ్, బ్యాంక్ శాంతమ్మ, చినబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసు సతీమణి సత్యవతి పాల్గొన్నారు.
![తిరుపతిలో 'ఆరిన'చిచ్చు](https://prajasakti.com/wp-content/uploads/2024/04/Untitled-1-copy.jpg)