మఠం స్థలంలో ఆక్రమణలు కూల్చివేతప్రజాశక్తి-తిరుపతి(మంగళం):శ్రీ స్వామీ హధీరాంజీ మఠానికి చెందిన పుదిపట్ల గ్రామ సర్వే నెంబరు 9/1 లోని 2ఎకరాల 17 సెంట్ల భూమిలో కె.వెంకటేష్ అనే వ్యక్తి అక్రమంగా రేకుల షెడ్, ప్రహరీ గోడను నిర్మించడంతో సమాచారం అందుకున్న హధీరాంజీ మఠం డిప్యూటీ కలెక్టర్, ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు మఠం సిబ్బందిని వెంటబెట్టుకుని అక్రమంగా నిర్మించిన షెడ్డును శనివారం తొలగించారు. ఈ సందర్భంగా ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ మఠంకు చెందిన సదరు స్థలంలో అక్రమంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పలుమార్లు వెంకటేష్ అనే వ్యక్తికి సిబ్బంది ద్వారా సమాచారం అందించినా అతను ఖాతరు చేయక అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ వచ్చారన్నారు. సదరు స్థలంలో గతేడాది అక్టోబర్ 9వ తేదీన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, బోర్డు సైతం తీసివేసి అక్రమ నిర్మాణ పనులు కొనసాగించాడన్నారు. దీనిపై అక్టోబర్ 11న ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు.అక్రమ నిర్మాణదారుడికి దేవాదాయ దర్మాదాయ చట్టం 30/1987 లోని సెక్షన్ 83 ద్వారా గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన నోటీసు ఇవ్వగా, ఆ నోటీసుకు ఎటువంటి ప్రతి స్పందన రాలేదన్నారు. శనివారం ఉదయం మఠం సిబ్బంది, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్, జిల్లా ఎండోమెంట్ అధికారి సహకారంతో పుదిపట్ల గ్రామ సర్వే నెంబరు 9/1లో చేపట్టిన అక్రమ కట్టడాలను జెసిబి యంత్రాలతో తొలగించడం జరిగిందన్నారు.తొలగించిన నిర్మాణ శిథిలాలను మఠం స్థలం నుండి ఖాళీ చేయడానికి రెండు రోజులు గడువు ఇచ్చామన్నారు. మఠంకు చెందిన భూములలో ఏదైనా అక్రమ నిర్మాణాలు చేపడితే దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.త్వరలో ఆ షాపులను స్వాధీనం చేసుకుంటాం…తిరుపతి పట్టణంలో గాంధీ రోడ్డు, పాత టిటిడి ఆఫీసు రోడ్డు, ప్రకాశం రోడ్డు, జిఎన్ మాడా స్ట్రీట్, కర్నాల వీది, కోలా విధి, బేరివీధి, అనంత విధి. ఆర్ఎస్ మాడా స్ట్రీట్, తిరుచానూరులోని మఠం భవనంలో వున్న సుమారు 128 పాపులకు 2019 సంవత్సరములోనే కాలం ముగిసినప్పటికీ, అప్పటి మహంత్ అర్జున్ దాస్ పట్టించుకోలేదన్నారు. వీరందరికీ దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చిన స్పందించలేదని, త్వరలో ఈ షాపులను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
![మఠం స్థలంలో ఆక్రమణలు కూల్చివేత](https://prajasakti.com/wp-content/uploads/2024/01/22222222222.jpg)