రూ.8 కోట్లతో రామాపురం రహదారికి మహర్దశరోడ్డు పనులకు భూమి పూజ చేసిన తుడా ఛైర్మన్ ప్రజాశక్తి -రామచంద్రాపురం: చంద్రగిరి నియోజక వర్గంలోని తిరుపతి రాయలచెరువు రోడ్డుకు తుడా, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో రూ.8 కోట్ల రూపాయలతో గంగిరెడ్డిపల్లి వరకు డివైడర్లతో కూడిన డబుల్ రోడ్డు ఏర్పాటుకు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. తుడా నిధులు రూ.4కోట్లు, రోడ్లు భవనాల శాఖ నిధులు రూ.4 కోట్లతో ( వేదాంతపురం) బైపాస్ రోడ్డు నుండి గంగిరెడ్డిపల్లి వరకు విద్యుత్ దీపాలు, పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా డబుల్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు మోహిత్ రెడ్డి తెలిపారు. దీంతో తిరుపతి రూరల్ ఆర్ సి పురం మండలానికి చెందిన ప్రజలకు గుంతల రహదారి సమస్య పరిష్కారమవుతుందని పలువురు ఆనంద వ్యక్తం చేశారు. ఈ డబుల్ రోడ్డు ను రాయల చెరువు వరకు ఏర్పాటు చేస్తే రాయల చెరువుకు వచ్చే పర్యాటకులకు అనువుగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమం లో తుడా, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు జడ్పిటిసి ఢిల్లీ రాణి, మాజీ ఎంపీపీ అత్తూరు. దామోదర్ రెడ్డి, వైసీపీ నాయకులు మూలం చంద్రమోహన్ రెడ్డి, వాసు నాయుడు, ముచ్చెలి ప్రదీప్ రెడ్డి తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ మాధవరెడ్డి, భాను కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.