శ్రీ సందర్శకులకు అన్ని రకాల సదుపాయాలు..శ్రీ జూ క్యూరేటర్ సెల్వంతో ప్రజాశక్తి ముఖాముఖిప్రజాశక్తి- తిరుపతి (మంగళం): శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో సందర్శనకు వచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. వచ్చే వేసవిని దష్టిలో ఉంచుకొని శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో జంతువుల రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టారన్న అంశాలను ప్రజాశక్తితో ముఖాముఖిలో వెల్లడించారు. ప్రజాశక్తి: ప్రస్తుతం జూ లో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి?. అధికారి: ప్రస్తుతం 85 రకాలకు చెందిన వన్యమగాలు, పక్షులు, పాములు వంటివి 1100 ఉన్నాయి. ప్రతిరోజు జూ సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన నివాస ప్రాంతాల వద్దకు వెళ్లి వాటి స్థితిగతులను పరిశీలించడం జరుగుతుంది. ఏదైనా అనారోగ్యం గుర్తించిన వెంటనే సంబంధిత ప్రాణిని వెటర్నరీ వైద్యులు చేత చికిత్స చేయిస్తాము. ప్రజాశక్తి: జూ లో సీసీ కెమెరాల పరిరక్షణ ఎలా ఉంది?.అధికారి: జూ లో గతంలో 60 సీసీ కెమెరాలతో జంతువుల సంరక్షణ కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేశాము. కానీ సందర్శకుల రక్షణలో భాగంగా మరిన్ని సీసీ కెమెరాలు అవసరమని గుర్తించి మరో 25 కెమెరాలను అదనంగా జూ లోని వివిధ ప్రాంతాల్లో వాటిని అమర్చడం జరుగుతుంది. జూ లో అమర్చిన సీసీ కెమెరాల వీడియోలను రెండు మానిటరింగ్ గదులను ఏర్పాటు చేసి వాటి ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాము. ప్రజాశక్తి: వేసవి దష్ట్యా జంతు సంరక్షణ చర్యలను వివరించండి…?అధికారి: ఈసారి వేసవిని దష్టిలో ఉంచుకొని శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ఉన్న జంతువుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఎండ వేడి నుండి ఉపసమనం కోసం స్ప్రింక్లర్స్, వట్టివేర్లు కట్టలు, కూలర్స్, సాసర్ ఫీట్స్, కూల్ పెయింట్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, గ్రీన్ మ్యాట్స్ వంటివి జంతు సంరక్షణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించాం. అదేవిధంగా జంతువులకు అందించే ఆహారంలోనూ వేసవిలో మార్పులు చేస్తాం. ప్రాణుల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండడానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తాం. ప్రజాశక్తి: జూ వార్షిక బడ్జెట్ ఎంత?.అధికారి: జూ నిర్వహణకు ఏడాదికి దాదాపు పది కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులోనే జూ నిర్వహణ, సిబ్బందికి జీతభత్యాలు, విద్యుత్ ఛార్జీలు, జంతువులకు ఇచ్చే ఆహారం వంటివి ఉంటాయి. ప్రజాశక్తి: సెంట్రల్ జూ అథారిటీ నుండి ఏదైనా నిధులు వస్తాయా?అధికారి: జూ లో రిస్క్యూ ప్రాణులు నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.60లక్షలు సెంట్రల్ జూ అథారిటీ వారు అందించడం జరుగుతుంది. వార్షిక బడ్జెట్తో కలుపుకొని 10 కోట్ల 60 లక్షలతో జూ నిర్వహణ సాగుతోంది. ప్రజాశక్తి: నీటి సమస్య ఉందా?.అధికారి: ప్రస్తుతం జూలో ఎటువంటి నీటి కొరత లేదు. జూ నిర్వహణకు కళ్యాణీ డాం నీటితోపాటు జూ లోపల బోర్లను ఏర్పాటు చేసుకున్నాం. వీటితో జూలో పచ్చదనం నిర్వహణకు, జంతువులకు తగినంత నీటి సదుపాయం ఉంది. ప్రజాశక్తి: సందర్శకుల రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టారు..?అధికారి: గత అనుభవాల దష్ట్యా సందర్శకుల రక్షణకు మరిన్ని రక్షణ చర్యలను తీసుకుంటున్నాం. అడవితో కలిపి ఉన్న జూ పూర్తిస్థాయి రక్షణ కోసం ఇప్పటికే రెండు మూడు చోట్ల పెద్ద పార్టీ గోడలను నిర్మించాము. రోడ్డు మార్గం వైపు కూడా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాము.
![వేసవి నేపథ్యంలో..జంతు రక్షణ చర్యలు ప్రారంభించాం..!](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Untitled-1-copy-59.jpg)