ఃశ్రీవాణిః అక్రమాలపై విజిలెన్స్కు ఫిర్యాదు ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఃశ్రీవారి ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించారని, భక్తులు ఎంత డిపాజిట్ చేశారని, ఆ మొత్తం ఏ సంస్థకు, ఆలయాల నిర్మాణానికి ఇచ్చారని, వాటిపై శ్రీవారి భక్తులకు అనుమానాలు ఉన్నాయని, తక్షణమే దర్యాప్తు చేపట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాలిః అని మంగళవారం తిరుపతి స్టేట్ విజిలెన్స్ కార్యాలయం నందు కిరణ్ రాయల్ జనసేన నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ నిధులలో అవకతవకలు జరిగాయని గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడారని, అవన్నీ వాస్తవమేనని, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఐదేళ్లలో తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్, దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని, వాటిమీద పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులను కోరామన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చిన సేవా టికెట్లు, విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అన్నింటిపై విచారించి, దర్యాప్తు చేయాలన్నారు. గత 5 సంవత్సరాలలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ఇచ్చిన టికెట్లలో దాదాపు కొన్నివేల టికెట్ల మీద అక్రమంగా వ్యాపారాలు జరిగాయన్నారు, దర్శనాల పేరుతో లాబీయింగ్ చేసుకొని దోచుకున్నారని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. వీటన్నిటిపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు సుభాషిని, హేమ కుమార్, చందన, ప్రసాద్, దుర్గ, వినోద్, కిషోర్ పాల్గొన్నారు.
![ఃశ్రీవాణిః అక్రమాలపై విజిలెన్స్కు ఫిర్యాదు](https://prajasakti.com/wp-content/uploads/2024/07/srivani-srivani.jpg)