శ్రీరామ్ కాలనీలో.. తాగునీరు కలుషితం బోర్లు, మోటార్ల నుంచి వస్తున్న రంగునీరు పెరుగుతున్న కిడ్నీ బాధితులు పట్టించుకోని అధికారులు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ శ్రీరామ్ కాలనీ వాసులను కలుషిత నీరు కలవరపెడుతోంది. గడిచిన రెండు సంవత్సరాలుగా కాలనీకి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన చేతి బోరు, మోటారు బోరు గుండా రంగు మారిన నీరు వస్తోంది. అదే నీరును తాగుతున్న కాలనీవాసులు కిడ్నీ సంబంధిత వ్యాధులు బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆ కాలనీలో 5 మందికి పైగా కిడ్నీ బాధితులు ఉండటం గమనార్హం. శ్రీరామ్ కాలనీలో సుమారు 40 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరిలో అత్యధికులు క్వారీ కార్మికులే. ఇప్పటికే చుట్టూ ఉన్న క్వారీ గుంతల కారణంగా తరచూ మలేరియా, టైఫాయిడ్, డయేరియా బారిన పడుతున్న కాలనీవాసులకు కలుషిత నీరు మరింత ప్రాణాంతకంగా మారుతోంది. రంగు మారిన నీరు తాము తాగలేకపోతున్నామనీ, రోగాల బారిన పడుతున్నామనీ, రక్షిత మంచినీటి సరఫరాను అందించాలని పలుసార్లు సర్పంచ్ కు, పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి శ్రీరామ్ కాలనీవాసులకు మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
శ్రీరామ్ కాలనీలో.. తాగునీరు కలుషితం బోర్లు, మోటార్ల నుంచి వస్తున్న రంగునీరు పెరుగుతున్న కిడ్నీ బాధితులు పట్టించుకోని అధికారులు
![శ్రీరామ్ కాలనీలో.. తాగునీరు కలుషితం బోర్లు, మోటార్ల నుంచి వస్తున్న రంగునీరు పెరుగుతున్న కిడ్నీ బాధితులు పట్టించుకోని అధికారులు](https://prajasakti.com/wp-content/uploads/2024/07/6666666666666666666.jpg)