ఏసీఏలో కోట్లు దోపిడి ఏసీఏలో కోట్లు దోపిడి ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసిఏ)లో అవినీతి అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, కోర్టు తీర్పును సైతం లెక్కచేయకుండా, దొంగ సభ్యత్వలతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ ( క్రికెట్ విజరు) విమర్శించారు. తిరుపతిలోని ఆయన కార్యాలయం వద్ద శుక్రవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి అవకాశాలను కల్పించేందుకు ఏర్పాటు చేయబడిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అక్రమాలకు, అవినీతికి అడ్డాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడారంగంలో రాజకీయాలను తీసుకొచ్చి, ప్రభుత్వ పెద్దల సహకారంతో క్రికెట్ అసోసియేషన్ తమ జేబు సంస్థలుగా మార్చేసి భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రీడాకారులు, అసోసియేషన్ అభివద్ధి కోసం బీసీసీఐ ప్రతి యాడాది కేటాయిస్తున్న 100 కోట్ల రూపాయలను, ఆంధ్ర అసోసియేషన్ పెద్దలని చెప్పుకునే వారు తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవడం బాధాకరమన్నారు. అపెక్స్ కమిటీ సభ్యులు ఇప్పటికే 130 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని కోర్టులో కేసు నడుస్తుందని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఉన్నవారు, వస్త్ర వ్యాపారాలు చేసుకుంటున్న వారు, అసలు క్రికెట్ కు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ఆంధ్ర క్రియేట్ అసోసియేషన్ లో సభ్యులుగా, నాయకులుగా ఉండడం విడ్డూరమన్నారు. ఇప్పటికే 130 కోట్లు అవినీతికి పాల్పడిన వీరు, మరో 105 కోట్లను దోచేందుకే ఇటీవలే జనరల్ బాడీ పేరుతో నిధులు మంజూరుకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. క్రికెట్ అసోసియేషన్లో ఇలాంటి అవినీతి అనుకొండల పెత్తనం పోయే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మూర్తి, సంయుక్త కార్యదర్శి సతీష్ యాదవ్, కోశాధికారి గిరి తదితరులు పాల్గొన్నారు.