‘బ్యాంక్ వారు మోసం చేశారు’ప్రజాశక్తి-శ్రీకాళహస్తి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవనూరు బ్రాంచ్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం ఓ ఖాతాదారురాలుకు శాపంగా మారింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొట్టంబేడు మండలం ఎగువ సాంబయ్యపాలెం గ్రామానికి చెందిన కే.మంజుల ఏప్రిల్ 4వ తేదీ( గురువారం )న తమ కుటుంబ అవసరాల నిమిత్తం తన వద్దనున్న 216 గ్రాముల బంగారు నగలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవనూరు బ్రాంచ్ నందు తాకట్టు పెట్టింది. అందుకోసం బ్యాంక్ అధికారులు రూ 8.50 లక్షలు నగదును బ్యాంకులోని 2వ కౌంటర్ నుండి లబ్ధిదారులు మంజుల కు అందించారు. బ్యాంకు అధికారులు అందించిన నగదులో రూ 500 ల సీల్డ్ కట్టలు 16, రూ 100 ల సీల్డ్ కట్టలు 5 ఇచ్చారు. ఈ మొత్తాన్నిసదరు క్యాషియర్ మిషన్ ద్వారా లెక్క చేయకుండానే లబ్ధిదారులకు ఇచ్చేశారు. ఆ నగదును ఇంటికి తీసుకెళ్లి లెక్కచేయగా రూ 500ల నోట్ల కట్టల్లోని 5 కట్టల్లో రూ 1500 లు చొప్పున తక్కువగా వచ్చింది . ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేయుటకు మరుసటి రోజే 5వ తేది (శుక్రవారం ) నగదు తక్కువ వచ్చిన రెండు కట్టలు బ్యాంకుకు తీసుకువెళ్లి బ్యాంక్ అధికారుల సమక్షంలో లెక్కచేయగా రూ.1500 చొప్పున తక్కువ వచ్చినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఇలా మొత్తం 5 కట్టల్లో రూ.7500 లు లబ్ధిదారు నష్టపోయింది . అయినప్పటికీ బ్యాంక్ అధికారులు ఏమాత్రం కనికరించక పోగా, తమ సిబ్బంది తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటూ లబ్ధిదారులదే తప్పు అని బుకాయించిన పరిస్థితి నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసుకోండి అని బ్యాంకు మేనేజర్ ఉచిత సలహా ఇవ్వడంతో లబ్దిదారు లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించింది.
!['బ్యాంక్ వారు మోసం చేశారు'](https://prajasakti.com/wp-content/uploads/2024/04/6666666666666666666666666.jpg)