చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం- రాష్ట్ర రక్షణకే చంద్రబాబు శ్రమ- రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్‌ నైజం- జగన్‌ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు- 13న రాక్షస పాలనకు ఓటుతో ఘోరీ కట్టాలి- నారా భువనేశ్వరి పిలుపు

చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం- రాష్ట్ర రక్షణకే చంద్రబాబు శ్రమ- రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్‌ నైజం- జగన్‌ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు- 13న రాక్షస పాలనకు ఓటుతో ఘోరీ కట్టాలి- నారా భువనేశ్వరి పిలుపుప్రజాశక్తి-శాంతిపురం : కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు చంద్రబాబు కుటుంబం అన్ని వేళలా సిద్ధంగా ఉందని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలకు తమ కుటుంబమంతా జీవితాంతం రుణపడి ఉంటామని, తమకు కుప్పం ప్రజల నుండి ఏమీ అవసరం లేదని, చంద్రబాబుకూ ఏమీ అవసరం లేదని, కానీ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల జీవితాలు వైసీపీ పాలనతో ప్రమాదంలో పడ్డాయని ఓటు హక్కుతో రాక్షస పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. శాంతిపురం మండలంలో మంగళవారం నిర్వహించిన సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి, తన పార్టీ నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్‌, కల్తీ మద్యం, ఇసుక, మట్టి, గ్రావెల్‌, ఇలా ఏది దొరికితే దాన్ని దోచుకుని వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారన్నారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై గత ఐదేళ్లుగా కక్షసాధింపు చర్యలు, దాడులు, హత్యలతో పేట్రేగిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఐదేళ్లుగా నరకం అనుభవించారు. రాష్ట్ర ప్రజలు ధరల భారంతో ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు. కానీ నోరెత్తి ప్రశ్నించే పరిస్థితి లేకుండా వాక్కు స్వాతంత్య్రాన్ని కూడా వైసీపీ నాయకులు ప్రజలకు లేకుండా చేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల పక్షాన చంద్రబాబు, లోకేష్‌ నిలబడి పోరాడినందుకు వైసీపీ ప్రభుత్వం వారిని పెట్టని ఇబ్బంది లేదని, అయినా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తమ కుటుంబం పోరాడుతుందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ అనే భూదోపిడీ చట్టాన్ని తీసుకొచ్చాడని, దీన్ని అమలు చేసి మనకు తెలియకుండానే మన భూములను తాకట్టు పెట్టి వాళ్ల జేబులు నింపుకోవాలని చూస్తున్నాడని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మేల్కొని తమకు అన్యాయం చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రజల ప్రభుత్వానికి స్వాగతం పలకాలని కోరారు.

➡️