ప్రజాశక్తి -మధురవాడ : ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణుడు, గోదావరి ఆనకట్ట రూపశిల్పి సర్ ఆర్ధర్ కాటన్ 221వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సర్ ఆర్థర్ కాటన్ భవనంలో నిర్వహించిన జయంతి సభలో గీతం ప్రో వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వై. గౌతంరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి. గుణశేఖరన్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ ముకుంద్ సీనియర్ ప్రొఫెసర్లు ఎమ్. రమేష్, తదితరులు పాల్గొని కాటన్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా గీతం ప్రో వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వై. గౌతంరావు మాట్లాడుతూ ప్రజల బాగు కోసం తపన పడి ఆంధ్ర రాష్ట్రాన్ని పచ్చగా ఉంచడానికి కాటన్ నిర్మించిన ఆనకట్టలు దోహదపడ్డాయని అన్నారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే యువత కాటన్ వంటి నిస్వార్ధ నిపుణులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కాటన్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ప్రోవిసి