కొనసాగుతున్న జిందాల్‌ భూ నిర్వాసితుల నిరసన

Feb 22,2024 20:49

ప్రజాశక్తి-శృంగవరపుకోట : తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, తమకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిందాల్‌ అల్యూమినా కంపెనీ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసన గురువారానికి మూడో రోజుకు చేరింది, ఈ దీక్షలలో కూర్చున్న పలువురు బాధితులు మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో జిందాల్‌ అల్యూమినా కర్మాగారం ఏర్పాటు చేస్తామంటే తమ భూములు అప్పట్లో గల ధరకు ఇచ్చామని, పరిశ్రమ ఏర్పాటు కాకముందే మీకు మా కంపెనీలో షేర్ల ద్వారా భాగస్వాములు చేస్తామని కంపెనీ నమ్మించిందని తెలిపారు. 16ఏళ్లు గడిచినా ఎటువంటి పరిశ్రమ రాని కారణంగా భూములు ఇచ్చిన పేద గిరిజనులైన తమ బతుకులు అధ్వాన్నంగా తయారై రోడ్డున పడ్డామని వాపోయారు. సేకరించిన భూముల్లో ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.ఇ పార్కు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటనలు చేసాయని, ఇంతవరకు ఏవీ ఏర్పాటు కాలేదని తెలిపారు. తమకు ప్రస్తుతం ఉన్న భూముల ధరల ప్రకారం చెల్లింపులు జరపాలని, ఇప్పటి విలువకు షేర్లు జారీచేసి కంపెనీలో తమకు భాగస్వామ్యం కల్పించాలని, పారిశ్రామికవాడ ఏర్పాటు చేసినపుడు తమకు ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, వైసిపి నాయకుడు మురళిరాజు, గిరిజన పంచాయితీలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

➡️