డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
బాబాసాహెబ్కు ఘన నివాళి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రతీ భారతీయుడు గర్వించే వ్యక్తి అంబేద్కర్ మహనీయుడని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందంటే, దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్ప మహోత్సవంలో భాగంగా, స్థానిక అంబేద్కర్ జంక్షన్లోని బాబాసాహెబ్ విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ మానవ హారాన్ని నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ, దేశంలో సుస్థిర పాలన, సామాజిక అభివృద్ది అంబేద్కర్ విరచిత రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యిందని అన్నారు. దేశానికి ఆయన ఆలోచనలు మార్గదర్శకమయ్యాయని చెప్పారు. దేశంలో తారతమ్యాలు లేకుండా, ప్రతీఒక్కరూ స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం అనుభవిస్తున్నారంటే, దానికి కారణం అంబేద్కర్ అని అన్నారు. అట్టడుగువర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, వారి అభ్యున్నతికి మార్గం చూపారన్నారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు, పాలనా విధానాలు మారినప్పటికీ, రాజ్యాంగం మాత్రం చెక్కుచెదరకుండా ఉందని, దానికి కారణం అంబేద్కర్ దార్శనికత అని కొనియాడారు. గొప్ప బాధ్యతను నిర్వర్తించిన అంబేద్కర్ మహనీయునికి ప్రతీఒక్కరూ రుణపడి ఉంటారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, ఆయన ఆలోచనలు ప్రతీ ఒక్కరికీ వివరించాలన్న గొప్ప సంకల్పంతో, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తిని ప్రతీఒక్కరూ కొనసాగించాలని కోలగట్ల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, జెడ్పి సిఇఓ కె.రాజ్కుమార్, సాంఘిక సంక్షేమాధికారి రామానందం, మెప్మా పిడి సుధాకరరావు, ఎస్సి కార్పొరేషన్ ఇడి సుధారాణి, రొంగలి పోతన్న, ఆశపువేణు, బంగారునాయుడు తదితర నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
![samata sankalapa mahotsavam in vzm](https://prajasakti.com/wp-content/uploads/2024/01/samata-sankalapa-mahotsavam-in-vzm.jpg)