విశాఖలో ఓ సెలూన్ షాపు యజమాని వినూత్న ఆఫర్
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ :భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దేశ తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెం మెట్టు, ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ సెలూన్ షాపు యజమాని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్కే స్మార్ట్ ది సెలూన్ అధినేత మల్లువలస రాధాకృష్ణ ఓటు వినియోగంపై ఓటర్లను చైతన్యం పరిచే క్రమంలో ఓటును సద్వినియోగం చేసుకున్న వారికి తన సెలూన్లో హెయిర్కట్ ఫ్రీ అంటూ ప్రకటించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ, ఓటుకున్న ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే తానీ వినూత్న ఆఫర్ను ప్రకటించానన్నారు.ఈ నెల 13న సోమవారం ఓటేసి వచ్చిన వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామన్నారు. తమ సెలూన్ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటానని, ఇది కూడా అందులో భాగమన్నారు.