ప్రజాశక్తి – నరసాపురం
యువతీ యువకులు క్రీడల్లో పాల్గొనడం వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారని ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా నరసాపురం నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు మంగళవారం స్థానిక వైన్ కళాశాల ప్రాంగణంలో బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, కోకోలో గెలుపొందిన విజేతలకు ఆర్డిఒ ఎం.అచ్యుత అంబరీష్తో కలిసి ప్రభుత్వ చీఫ్విప్ ప్రసాదరాజు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొంది నరసాపురం నియోజకవర్గానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్డిఒ అచ్యుత అంబరీష్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఓటమి, గెలుపును సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైౖర్ పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణ, ఎఎంసి ఛైర్మన్ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.